త్వరలో ఆగిపోనున్న మీ ఎస్బీఐ ఏటీఎం కార్డును ఎలా మార్చుకోవాలంటే..

మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వినియోగదారులా? అయితే మీ ఏటీఎం కార్డు మరికొద్ది నెలల వరకు మాత్రమే పనిచేస్తుంది. ఆ తర్వాత ఆ కార్డుకు వ్యవధి ఉన్నా కూడా పనిచేయదు. ఈ విషయమై ఆగస్టు 14నే ఎస్బీఐ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అందులో ప్రస్తుతం తమ వినియోగదారులు వాడుతున్న మ్యాగ్నటిక్ స్ట్రిప్ ఏటీఎం, డెబిట్ కార్డులు ఈ ఏడాది చివర వరకు మాత్రమే పనిచేస్తాయని, ఆ తర్వాత నుంచి పనిచేయవని వెల్లడించింది. వినియోగదారులు ప్రస్తుతం వాడుతున్న మ్యాగ్నటిక్ స్ట్రిప్ ఏటీఎం, డెబిట్ కార్డుల నుంచి ఈఎంవీ చిప్ ఏటీఎం కార్డులకు మళ్లాలని తెలిపింది.

వినియోగదారుల నగదు భద్రత కోసమే ఈ మార్పులు చేస్తున్నామని వెల్లడించింది. ప్రస్తుతం ఏటీఎం మోసాలు, కార్డులను క్లోన్ చేయడం, తదితర మోసాల నుంచి తమ వినియోగదారులను రక్షించే ఉద్దేశంతో, వారి సొమ్ముకు మరింత భద్రత కల్పించడానికే తాము ఈఎంవీ చిప్ కార్డులను ప్రవేశపెడుతున్నట్టు పేర్కొంది. మ్యాగ్నటిక్ స్ట్రిప్ కార్డులతో పోల్చితే ఈఎంవీ చిప్ కార్డులు మరింత సురక్షితంగా ఉంటాయని వివరించింది. కాబట్టి వీలైనంత తొందరలో వినియోగదారులు మ్యాగ్నటిక్ స్ట్రిప్ కార్డుల స్థానంలో ఈఎంవీ చిప్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని ఎస్బీఐ సూచించింది.

మీకు ఎస్బీఐ ఆన్లైన్ బ్యాంకింగ్ సౌకర్యం ఉంటే.. ఈఎంవీ చిప్ కార్డును పొందడం చాలా సులువు. కార్డు పొందడానికి ముందుగా ఎస్బీఐ ఆన్లైన్ బ్యాంకింగ్ వెబ్సైట్లో యూజర్ నేమ్, పాస్ వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. హోంపేజీలో కనిపించే 'e-services' ను క్లిక్ చేస్తే 'atm card services' వస్తుంది. అక్కడ స్క్రీన్ పై వచ్చే సూచనలను అనుసరిస్తూ కొత్త ఈఎంవీ చిప్ కార్డుకు దరఖాస్తు చేసుకోండి. మీకు ఆన్లైన్ బ్యాంకింగ్ సౌకర్యం లేకపోతే దగ్గరలోని ఎస్బీఐ బ్రాంచ్ ను సంప్రదించండి.
మీరు పొందే ఈఎంవీ చిప్ కార్డు అంతర్జాతీయ ప్రమాణాలను కలిగి ఉండటమే కాకుండా మీ డేటాను, సొమ్మును సురక్షితంగా ఉంచుతుంది. ఈ ఈఎంవీ చిప్ కార్డును ఉచితంగా పొందొచ్చు. 

Comments